
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: స్థానిక ప్రజా సమస్యలపై సర్వేలు నిర్వహించి, సమస్యలపై ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు. హుజురాబాద్ పార్టీ కార్యాలయంలో వాసుదేవరెడ్డి మాట్లాడుతూ మండల కేంద్రంలో నిర్మించిన 500రెండు పడక గదుల ఇళ్ళను లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలన్నారు. సంవత్సరాలు గడుస్తున్న ఎవరికి ఇండ్లను కేటాయించకపోవడం మూలంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా తయారయ్యాయన్నారు. 15 రోజుల్లో అర్హులైన పేదలకు రెండు పడక గదుల ఇళ్లను కేటాయించాలని లేనియెడల అర్హులైన లబ్ధిదారులతో ఇండ్లను స్వాధీనం చేసుకొని పేదలు నివాసం ఉంటారని పేర్కొన్నారు. హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. నీటి ఎద్దడి నివారణకు అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎక్కడికి అక్కడ చలివేంద్రాలు, అంబలి కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల 5000 కోట్లు కేటాయించినప్పటికీ ప్రాధాన్యత రంగాలను పూర్తిగా విస్మరించారని, విద్యా, వైద్యానికి తగినంత నిధులు కేటాయించలేదన్నారు. ఉత్పాదకరంగమైన వ్యవసాయ రంగానికి కేవలం 8 శాతం మాత్రమే నిధులు కేటాయించడం అంటే వ్యవసాయంపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిర్లక్ష్యం స్పష్టం అవుతుందన్నారు. రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతు కూలీలకు రూ.12000, కౌలు రైతులకు 15000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావలసిన నిధులు ఇవ్వకుండా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి కొప్పుల శంకర్, కమిటీ సభ్యులు కొంకట చంద్రయ్య, నాయకులు చేరాలు, దాట్ల రత్నాకర్, మాట్ల చిరంజీవి, మోరే మహేష్, కొడిమ్యాల వెంకటేష్, పోడిశెట్టి ప్రభువు శంకర్, అన్నపు రమేష్, గోనే ప్రశాంత్, మద్ద బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి..