
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: చిన్న హనుమాన్ జయంతి సందర్బంగా ఈ నెల 12వ తేదీ శనివారం నాడు కరీంనగర్ లో నిర్వహించనున్న శ్రీ వీరహనుమాన్ విజయ యాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు ఏర్పాట్లు చేయనున్నట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్, టౌన్ ఏసీపీ కార్యాలయంలో గురువారంనాడు డివిజన్ లోని పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. శోభాయాత్ర సందర్బంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ఆయన సమీక్షించారు. ఈ యాత్ర కరీంనగర్లోని వైశ్య భవన్ ప్రక్కన గల రామాలయం నుండి ప్రారంభమై రాజీవ్ చౌక్ , టవర్ సర్కిల్ , గంజ్ రోడ్, రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా, కమాన్ రోడ్ మీదుగా , బస్టాండ్, తెలంగాణ చౌక్ , ఐబీ చౌరస్తా, కోర్ట్ చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, గాంధీ స్టాట్చ్యు తిరిగి రామాలయం వద్ద ముగుస్తుందని తెలిపారు. దాదాపు ఆరు కిలోమీటర్ల మేర నిర్వహించు ఈ యాత్రకు 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పోలీసు కమీషనర్ తెలిపారు. బందోబస్తులో భాగంగా స్టాటిక్ ఫోర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్ , మొబైల్ పెట్రోలింగ్, అవసరమైన చోట రూఫ్ టాప్ లతో పాటు సున్నితమైన ప్రాంతాల్లో పికెట్ లు కూడా ఏర్పాటు చేస్తున్నామని కమీషనర్ తెలిపారు. ఈ యాత్రలో సీసీ కెమెరా ల పర్యవేక్షణతో పాటు పోలీసు డ్రోన్ లను వాడనున్నామని ఆయన తెలిపారు. ట్రాఫిక్ రద్దీ వుండే ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు దారి మల్లింపు చర్యలు చేపడుతున్నారని ఆయన తెలిపారు. యాత్ర నిర్వహించు మార్గం అంతా పోలీసు కమీషనర్ గురువారంనాడు ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీసు కమీషనర్ తో పాటు అడిషనల్ డీసీపీ ఏ లక్ష్మీనారాయణ, ఏసీపీ లు వెంకటస్వామి టౌన్ , యాదగిరిస్వామి ట్రాఫిక్ , టౌన్ ఇన్స్పెక్టర్లు బిల్లా కోటేశ్వర్ , సృజన్ రెడ్డి , జాన్ రెడ్డి , ఖరీముల్లాఖాన్ లతో పాటు ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.






