
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్ మే 15: తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం చెలరేగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా మండిపడ్డారు. గురువారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ను ఉద్దేశించి ఆగ్రహోత్తరంగా స్పందించారు. రెవంత్ రెడ్డి రాజకీయ గద్దెపై కూర్చొని మాట్లాడుతున్న తీరు చూస్తే ఆయనకు మతి భ్రమించిందా అనే అనుమానం కలుగుతోంది, అని కొప్పుల తూట్ల వర్షం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఏ నాయకుడిని ఎక్కడ పెట్టాలనేది మా పార్టీ అంతర్గత వ్యవహారం. మాకు మీ అనుమతి అవసరమా? అని ప్రశ్నించారు.
దళితుల పై ప్రేమ పేరుతో డ్రామా..!
రేవంత్ రెడ్డి దళితులపై ప్రేమ చాటుతూ బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారన్న ఆయన,కాంగ్రెస్ పార్టీకి దళితులపై ప్రేమ ఉంటే ఇప్పటి వరకు ఎందుకు దళితుడిని ప్రధాని చేయలేదు? అధ్యక్షుడిని ఎందుకు ఎక్కువ కాలం కొనసాగించలేదు? అని నిలదీశారు.ఖర్గే పేరుతో మొసలి కన్నీళ్లు కారుస్తూ, చేతల్లో మాత్రం రాహుల్ నాయకత్వాన్ని నెపదించడం ఏమిటి?అంటూ విమర్శల వర్షం కురిపించారు.దళితులను ఎలివేటర్కు ఎక్కించినట్టు పదవులు ఇచ్చి వెంటనే దిగేస్తే.. అది ప్రేమ కాదు, ప్రదర్శన మాత్రమే అని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ దళితులకు న్యాయం చేసిన పార్టీ
బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు కీలక పదవులు ఇచ్చిన ఘనత తమదేనని ఈశ్వర్ గుర్తు చేశారు.రెండు సార్లు డిప్యూటీ సీఎం పదవులు దళితులకే ఇచ్చాం. మా పార్టీలో సామాజిక న్యాయం నాట్యం కాదు, నిత్యం! అని ఘనంగా ప్రకటించారు.కేసీఆర్ అభివృద్ధి దిశగా స్పష్టమైన విజన్ కలిగిన నాయకుడు. అందుకే 2014లో ఆయన్నే సీఎంగా ఎన్నుకున్నారు. అది రాష్ట్రానికి మంచి చేసింది. అప్పట్లో దళిత సీఎం అంటే రాష్ట్ర ప్రయోజనాలే తాకట్టవుతాయన్న ఆలోచనలో నిర్ణయం తీసుకున్నాం అన్నారు. కాంగ్రెస్ అంటే గాంధీ కుటుంబమే మిగతా వారు డమ్మీలు! ఖర్గే పేరుతో నేతలు ఎంచుకుంటారు కానీ ఆదేశాలు మాత్రం రాహుల్ నుంచే వస్తాయి అని సూటిగా విమర్శించారు. పి.వి. నరసింహారావును అవమానించిన పార్టీకి దళితులపై ప్రేమ ఉందంటారా? నిజంగా ప్రేమ ఉంటే దామోదర రాజనర్సింహా లేదా వివేక్ వెంకటస్వామిలాంటి దళితులను సీఎంగా పెట్టండి, అంటూ సవాల్ విసిరారు.
రేవంత్ మాటలు… బిల్లా రంగాల స్టైల్..!
బిల్లా రంగాల్లా మాట్లాడే రేవంత్, సీఎం పదవికి తగిన స్థాయిలో లేరు. పాలన చేతకాక మాటలతో ఎప్పుడూ చెమటలు పట్టిస్తున్నారు అని కొప్పుల ఈశ్వర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల దళిత డిక్లరేషన్ అమలుపై స్పందించకుండా, బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం తగదు. ముందుగా మీ వాగ్దానాలు నిలబెట్టుకోండి అని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నేతలు రఘువీర్ సింగ్, గుంజపడుగు హరిప్రసాద్, మైకేల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్..