
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలో చాలా పనులు పెండింగ్లో ఉన్నాయని వాటితోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అభివృద్ధి పనులను రద్దు చేసిందని వెంటనే వీటిని తిరిగి అమలు చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా అభివృద్ధి కుంటుపడిందని, జిల్లా మంత్రితోపాటు అధికారులు కూడా కరీంనగర్ అభివృద్ధికి ఏమాత్రం చొరవ చూపడం లేదని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి మాత్రమే జిల్లాలో కనబడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అటుకెక్కిందని అన్నారు. ప్రభుత్వం గొప్పది చెప్పుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లలో కూడా అవినీతి జరుగుతుందని అన్నారు. అలాగే హుజురాబాద్ నియోజకవర్గంలో చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉండి హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం చాలా పనులు చేపట్టామని అన్నారు. గతంలో హుజురాబాద్ లో మినీ స్టేడియం కోసం పది కోట్లు కూడా మంజూరు అయినప్పటికీ వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసిందని అన్నారు. వెంటనే మినీ స్టేడియం ఏర్పాటు కోసం 10 కోట్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కల్వల ప్రాజెక్టు కూడా టెండరింగ్ అయిందని వెంటనే నిధులు విడుదల చేస్తే ప్రాజెక్టు కూడా పూర్తవుతుందని, చాలామంది రైతులకు ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి కలుగుతుందని అన్నారు. దళిత బంధు రెండో విడత కూడా వెంటనే అమలు చేయాలని అన్నారు. అలాగే చిలుకల వాగు, అంబేద్కర్ భవనం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తో పాటు జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట, కమలాపూర్ మండలాల్లో చాలా రకాల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని కలెక్టర్ సహకారం అందించి అభివృద్ధి పనులను పునరుద్ధరిస్తే హుజురాబాద్ అభివృద్ధికి తోడ్పాటు అందించినట్లు ఉంటుందని అన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణరావు మరియు మాజీ మున్సిపల్ చెర్మన్ లు కౌన్సెలర్స్ మాజీ ఎంపీపీ లు మాజీ జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు..


విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్ ఇతర ప్రజాప్రతినిధులు..