
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్,మే 22: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ ఉమెన్ ఫర్ ట్రీస్’ కార్యక్రమంలో భాగంగా, మహిళల భాగస్వామ్యంతో విరివిగా మొక్కలు నాటీ సంరక్షించాలని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య సూచించారు. గురువారం హుజురాబాద్ పురపాలక సంఘ కమిషనర్ కెంసారపు సమ్మయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని ఇప్పల్ నర్సింగాపూర్, కేసీ క్యాంపు, దమ్మక్కపేట ఏరియాలలో మొక్కలు నాటడానికి అనువైన స్థలాలను గుర్తించి, సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ పురపాలక సంఘం పరిధిలోని మహిళా సంఘాల సభ్యులందరూ ఈ స్థలాల్లో వర్షాకాలంలో మొక్కలను నాటి, జియో ట్యాగ్ ద్వారా వాటిని తప్పనిసరిగా రెండు సంవత్సరాల పాటు సంరక్షించాలని సూచించారు. మొక్కలు సక్రమంగా పెరిగేలా మహిళలు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు, మహిళల భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని మున్సిపాలిటీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ జి సాంబరాజు, కార్యాలయ మేనేజర్ ఆర్ భూపాల్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు జె శ్రీకాంత్, ఎండీ రషీద్, వార్డు అధికారులు, శానిటరీ జవాన్లు, మెప్మా ఏడీఎంసీ మల్లీశ్వరి, సీఎల్ఆర్పీలు రమాదేవి, స్వరూప, ఆర్పీలు, పట్టణ పరిధిలోని మహిళా సంఘాల నుండి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.




కమిషనర్ సమ్మయ్యకు పుష్ప గుచ్చాలు ఇచ్చి స్వాగతం పలుకుతున్న మెప్మా సభ్యులు