
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సామర్ధ్యాల సాధన కోసం వృత్యంతర శిక్షణలు అత్యంతావశ్యకం అని కోర్స్ డైరెక్టర్, హుజురాబాద్ మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్ అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 5 రోజుల శిక్షణ కార్యక్రమం ముగిసిన సందర్బంగా మండలంలోని ఉపాధ్యాయులతో అయన మాట్లాడారు. తెలుగు సబ్జెక్టులో FLN బోధన విధానాలు, పఠనం, లేఖనం, గ్రంథాలయ నిర్వహణ, తల్లి దండ్రుల సమావేశం(పీటీఎం) నిర్వహణ ఉపాధ్యాయులకు వివరించామన్నారు. గణిత శిక్షణలో భాగంగా నిత్యజీవితంలో గణిత ఉపయోగం అకాడమిక్ స్టాండర్డ్స్, అభ్యసన సామర్థ్యాలు, పీరియడ్ ప్లాన్స్, సంఖ్యా భావన, చతుర్విధ ప్రక్రియలలో విద్యార్థులు తరచుగా చేసే తప్పులు వాటికి గల కారణాలు, వాటినీ నివారించుటకు చేపట్టవలసిన పద్ధతుల గురించి, వివిధ రకాల అమరికలు, సౌష్టవ పటాలు మరియు నూతనంగా సిలబస్ లో ప్రవేశపెట్టబోవు డిజిటల్ లిటరసీ గురించి శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. ఉపాధ్యాయులకు బోధనలో అత్యాధునిక సాంకేతికతను జోడించి విద్యాబోధన చేయాలనే ఆలోచనలతో.. ఇంగ్లీష్ శిక్షణలో భాగంగా ప్రాధమిక తరగతులకు సంసిద్దతా కార్యక్రమాలు, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, టీచర్స్ స్టేటజిలను నేర్పించామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు వచ్చే విద్యా సంవత్సరంలో ఆధునిక పద్ధతులను ఉపయోగించి సమర్థవంతమైన సాంకేతికతను జోడించి విద్యా బోధన చేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మెరుగుపరచాలని తెలియజేశారు.
నైపుణ్యాలను మెరుగుదల పరుచుకొని అభ్యసన ఫలితాలను సామర్థ్యాలకనుగుణంగా అభ్యసన ఫలితాలను పొందవచ్చని తెలిపారు. వృత్తినిబద్దత, అంకితభావంతో పనిచేసినట్టయితే సమాజం ఉపాధ్యాయ లోకాన్ని ఎల్లకాలం గుర్తించుకుంటుందని, అంకితభావంతో ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. తరగతిలో కనీసం ఒక సబ్జెక్టులోనైనా ఒక విద్యార్థి ఒక మంచి నైపుణ్యత కలిగిన విద్యార్థిగా తీర్చిదిద్దినట్లయితే అది ఉపాధ్యాయుడి విజయంగా చెప్పుకోవచ్చని, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనను బయటకు తీసే విధంగా ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మెరుగు పరచుకోవాల్సిన అవసరం ఉంటుందని అయన తెలిపారు. ఈ శిక్షణలో చురుకుగా పాల్గొన్న రిసోర్స్ పర్సన్స్ ని, సభ్యులను శాలువాతో సన్మారించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ గాజుల ఆంజనేయులు, పత్తేo శ్రీనివాస్, ముశం సత్యరాజం, దానంపల్లి శ్రీనివాస్, అల్లి శ్రీనివాస్, తంగేళ్లపల్లి శ్రీనివాస్, దోమల సదానందం, సాహెదా సల్మా పాల్గొన్నారు.

ఎంఈఓ బి శ్రీనివాసులు సన్మానిస్తున్న ఉపాధ్యాయులు.




శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో కోర్సు డైరెక్టర్లు..