
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ: శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ బడుల పటిష్టత పరిచే బాధ్యత ప్రభుత్వానిదేనని పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్కే వెంకటేష్ డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండలం ఎంపీయుపిఎస్ జగన్నాథ్ పూర్ గ్రామంలో నిర్వహించిన బడిబాట, పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆర్కే వెంకట్ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడులలో విద్య అభ్యసిస్తున్న చిన్నారులకు సమాజ భాగస్వామ్యంతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ బడులకు అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, ప్రభుత్వ యంత్రాగం అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వ బడులను పరిష్ఠపరిచే విధంగా విద్యా వ్యవస్థను ఒక గాడిలో తీసుకువచ్చి కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడిని అరికట్టే విధంగా విద్యా కమిషన్ ఒక చట్టం చేసే విధంగా ఉండాలన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ ప్రైవేటు వ్యవస్థ దోపిడిని అరికట్టలేక పోవడాన్ని ప్రభుత్వంపై ఆర్కే వెంకట్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తాను చదువుకున్న కాలంలో గ్రామీణ స్థాయిలో ప్రైవేటు పాఠశాలలకు కనీస సౌకర్యాలు ఉంటే తప్ప అనుమతించబడిన పరిస్థితుల్లో నేడు ప్రభుత్వం కనీస సౌకర్యాలు లేకుండా ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసే విధంగా ప్రైవేటు విద్యను ప్రోత్సహించడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే మేల్కొని ప్రభుత్వ బడుల పటిష్టతకు కృషి చేయాలని తల్లిదండ్రులు, సమాజం వేయికళ్లతో ఎదురు చూస్తుందన్నారు. వెంటనే విద్యా కమిషన్ చర్యలను ప్రారంభించాలని ప్రతి విద్యార్థికి విద్యతో పాటు ఆటపాటలను అందుబాటులో ఉంచాలని మరియు ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల యొక్క న్యాయపరమైన 57 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వాన్ని ఆర్కే వెంకట్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్ జ్యోతిరాణి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ భాగ్య -సమ్మయ్య, ఎస్ఎంసి మాజీ చైర్మన్ కంది రవీందర్ రెడ్డి, మహిళా సమైక్య, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామపంచాయతీ కార్యదర్శి దీప, గ్రామస్తులు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధి కమిటీలు, విద్యాభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.


గ్రామంలోని తల్లిదండ్రులకు వివరించి చైతన్య పరుస్తున్న ఆర్కే వెంకటేష్