
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, మే 30: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన గాజె ఆంజీ(20) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ విషాదకరమైన సంఘటన నిన్న (గురువారం) సాయంత్రం చోటుచేసుకోగా పోలీసుల వివరాల ప్రకారం… ఆంజీ తన సైకిల్ మోటార్ (AP-15-AE-9644) పై హుజూరాబాద్ వారసంతకు వెళ్లి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకొని తిరిగి స్వగ్రామం ధర్మరాజుపల్లికి బయలుదేరాడు. మండలంలోని పెద్దపాపయ్యపల్లి శివారులోని కాకతీయ ప్రధాన కాలువ సమీపంలోకి రాగానే, వెనుక నుండి వేగంగా వస్తున్న జాన్ డీర్ ట్రాక్టర్ (AP-15-BB-7694) డ్రైవర్ అజాగ్రత్తగా, అతివేగంగా ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఆంజీ సైకిల్ మోటార్ను ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో ఆంజీ సైకిల్ మోటార్పై నుండి కిందపడిపోగా, ట్రాక్టర్ అదే సైకిల్ మోటార్పై వెళ్లడంతో ఆంజీ తలకు బలమైన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, 108 అంబులెన్స్ ద్వారా ఆంజీని హుజూరాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ నిన్న రాత్రి ఆంజీ మృతి చెందాడు. అయితే అంజి మృతి డ్రైవర్ నిర్లక్ష్యంతోనే జరిగిందని ఆరోపిస్తూ ధర్మరాజుపల్లి గ్రామస్తులు, మృతుని కుటుంబ సభ్యులు హుజురాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు సిద్ధపడగా పెద్దమనుషులు ట్రాక్టర్ యజమానితో రాజీ కుదిరిచినట్లు తెలిసింది. ఈ ఘటనపై ఆంజీ తండ్రి గాజె రాజు ఫిర్యాదు మేరకు హుజూరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
