
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాలలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై విచారణ జరిపి వెనువెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.
బుధవారం హుజురాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన భూభారతి నూతన రెవెన్యూ చట్టం గ్రామ రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూభారతి నూతన రెవెన్యూ చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని అన్నారు. భూ సమస్యలు ఉన్న ప్రజలు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను రెవిన్యూ అధికారులు పక్కాగా రికార్డు నమోదు చేయాలని అన్నారు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలని అన్నారు. జూన్ 20వ తేదీ వరకు అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామని,
భూ సమస్యలున్న ప్రజలు ఈ రెవెన్యూ సదస్సులకు హాజరై దరఖాస్తు సమర్పించాలని సూచించారు. కనుకులగిద్ద గ్రామానికి చెందిన అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు, అధికారులకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు ఇవ్వాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సులో హెల్ప్డెస్క్, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. సమస్యల వారీగా అర్జీలను విభజించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి రమేష్ బాబు, తహసిల్దార్ కనకయ్య, రెవెన్యూ సిబ్బంది, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.



