
–స్పందించని మున్సిపల్ సిబ్బంది అసిస్టెంట్ కమిషనర్ వ్యాఖ్యలు దుమారం
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, జూన్ 4: కరీంనగర్ బస్టాండ్ సమీపంలోని ప్రముఖ మయూరా హోటల్ పరిశుభ్రతపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం టిఫిన్కి హోటల్లోకి వెళ్లిన భగత్ నగర్కు చెందిన భాస్కర్ శ్రీను కుటుంబంతో కలిసి పూరీ ఆర్డర్ చేయగా, అందిన పూరీ కర్రిలో చనిపోయిన ఈగలు దర్శనం ఇచ్చాయి. ఈ దృశ్యాన్ని చూసి కంగుతిన్న కస్టమర్లు హోటల్ సిబ్బందిని నిలదీయగా, “ఈగే కదా!” అంటూ నిర్లక్ష్యంగా స్పందించారు.ఈ ఘటనను మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ జక్కుల సువార్త దృష్టికి తీసుకెళ్లిన కస్టమర్లకు, “ఈ విషయాన్ని పత్రికలో వేయించండి” అంటూ ఆమె చెప్పినట్టు సమాచారం. ప్రజల ఆరోగ్యాన్ని ఉద్ధరంగా తీసుకుంటున్న అధికారుల వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశంపై ఫిర్యాదు చేసేందుకు మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లిన యువకులు ఉదయం 11:30 అయినా అక్కడ ఒక్క సిబ్బంది కనిపించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యానికి హాని చేసే సంఘటనలపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన సమయంలో మునిసిపల్ సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అధికారుల నిర్లక్ష్యం, హోటల్ నిర్వాహకుల బాధ్యతారాహిత్యంపై కరీంనగర్ ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహావేశం వ్యక్తమవుతోంది. తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.




