
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని వివేకానందనగర్ అంగన్వాడి కేంద్రంలో బుధవారం ‘అమ్మ మాట – అంగన్వాడి బాట’ కార్యక్రమం పండుగ లాగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐసి డిఎస్ ఆధ్వర్యంలో చేపట్టగా దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ…అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించబడుతున్న పౌష్టికాహారాన్ని తల్లులు, గర్భిణీలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వవచ్చునని సూచించారు. ప్రీ-స్కూల్ హాజరును మెరుగుపర్చేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీడీపీఓ సుగుణ మాట్లాడుతూ.. ప్రభుత్వము ప్రతిష్టాత్మక పథకంగా ప్రారంభించిన ఎగ్ బిర్యానీ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. చిన్నారులు ఎదుగుదలకు ఎగ్ బిర్యానీ ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. అనంతరం చైల్డ్ లేబర్ రహిత సమాజంపై అవగాహన కల్పించే పోస్టర్ను ఆవిష్కరించి, చైల్డ్ లేబర్ నివారణపై పట్టణంలో అంగనవాడి టీచర్లు, సిబ్బంది, చిన్నారులచే ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పద్మ, ఐసిపిఎస్ సోషల్ వర్కర్ రమేష్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తల్లిదండ్రులు, చిన్నారులు పాల్గొన్నారు.







పట్టణంలో ర్యాలీ తీస్తున్న చిన్నారులు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది