
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కుటుంబ విషయంలో భార్యతో, ఆమె కుటుంబ సభ్యులతో గొడవపడి కోపోద్రిక్తుడైన భర్త ఆవేశంతో పక్కనే ఉన్న హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ రోడ్డులో గల కాకతీయ కెనాల్ లో దూకాడు. వివరాలలోకి వెళితే…నల్గొండ జిల్లా నకిరేకల్ కు చెందిన శివరాత్రి సైదులు (26) గత కొంతకాలంగా హుజురాబాద్ లో బావులు తవ్వే పనీ కోసం హుజురాబాద్ లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల కుటుంబ విషయంలో సైదులు భార్యతో గొడవపడ్డాడు. భార్యాభర్తల గొడవ గురించి తెలుసుకున్న భార్య సోదరుడు వచ్చి బెదిరించడంతో సైదులు కోపోద్రుక్తు డై సమీపంలోని కెనాల్లో దూకాడు. సమాచారం అందుకున్న ఫైర్, పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. కెనాల్లో దూకి అపస్మారక స్థితిలో ఉన్న యువకుడ్ని స్థానికుల సహాయంతో బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితునికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కేవలం క్షణికావేషానికి లోనై భార్యాభర్తల మధ్య విభేదాలతోనే ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు స్థానికులు తెలిపారు.



