
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్, జూన్ 25: తెలంగాణలో అత్యంత అంగరంగ వైభవంగా హైదరాబాద్ జిల్లా జిహెచ్ఎంసి పరిధిలో గల దేవాలయాల్లో నిర్వహించే బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 20 కోట్ల రూపాయలను 2783 దేవాలయాలకు వివిధ కార్యక్రమాలు నిర్వహణకై చెక్కుల రూపంలో నిధులు జారీ చేయడం జరిగిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్లు అందించిన సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆషాడమాసంలో ముందుగా నగరంలో గోల్గొండ బోనాలు జూన్ 20న, జూలై 1,2 తేదీలలో బల్కంపేట ఎల్లమ్మ బోనాలు, జూలై 13,14 తేదీలలో శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానం నందు, జూలై 20న లాల్ దర్వాజా బోనాలు అలాగే జూలై 23న చార్మినార్ భాగ్యలక్ష్మి బోనాలు అలాగే మిగిలిన దేవాలయాల కూడా బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ సంప్రదాయానికి, నిర్దిష్ట విధి విధానాల చట్రానికి అతీతంగా ఉండే మాతృదేవతారాధన, గ్రామీణ దేవతారాధన లోంచి పుట్టిన బోనాలు క్రమక్రమంగా సాంప్రదాయంగా ఏర్పడటం ఒక విశేషం అని ఈ పరిణామ క్రమంలో హైదరాబాద్ జంట నగరాల్లో శతాబ్ద కాలం నుంచి జరుగుతున్న ఈ బోనాల పండుగ మరెన్నో సామాజిక, నిర్మాణాత్మక పరిణామాలను కూడా చెప్పకనే చెబుతుందని అన్నారు.
మొదట్లో పల్లెలకు, గ్రామాలకు సంబంధించిన ఉత్సవ విశేషంగా బోనాల పండుగ ఉండేదని ఇప్పుడు హైదరాబాద్ నగరంకి విస్తరించి మహానగరంగా ఎదిగిన తర్వాత కూడా అనాదికాలపు గ్రామీణ జీవన సంస్కృతికి ఇంత ఆదరణ, ఆచరణ ఉండటం భారతీయ జీవన విధానంలోని వైవిధ్యతకు, తెలంగాణ ప్రజల్లో ఉండే మట్టి మానవ సంబంధాల పరస్పర ప్రభావానికి అచ్చమైన ఉదాహరణలుగా బోనాలు చెప్పుకోవచ్చు అని మంత్రి తెలిపారు. స్త్రీలను శక్తి రూపాలుగా ఆరాధించే విధానం 12వ దశాబ్ద కాలం నాటికే తెలంగాణ ప్రాంతంలో బోనాలు సాహితీ ప్రస్తావన వ్యాప్తిలో ఉందని మంత్రి తెలిపారు. బోనాల సందర్భంగా జిహెచ్ఎంసి పరిధిలో గల జంట నగరాల దేవాలయాల్లో ఊరేగింపు దశ గతంలో స్వాగతం, శోభయాత్ర, తొట్టెల ఊరేగింపు, పోతురాజుల వీరంగాలు, ఎదుర్కోలు, అలాగే బోనాల సమర్పణలో అమ్మవారి గుడి దగ్గరికి బోనాలు సమర్పించడం, ముక్కులు తీర్చుకోవడం బోనాలు పంచటం, జరుగుతుందని అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ, కళ్యాణ మహోత్సవం, బోనాలు ఎత్తే కార్యక్రమం, రంగం నిర్వహణ, అంబారి ఊరేగింపు కార్యక్రమం, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా కళా ప్రదర్శనలు తదితర కార్యక్రమాలకు నిధులు జారీ చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.


మంత్రి పొన్నం ప్రభాకర్…