
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జూలై11: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య పేర్కొన్నారు. హుజురాబాద్ పట్టణంలోని విద్యానగర్ గల విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ స్కూల్ లో శుక్రవారం విద్యార్థిని విద్యార్థులకు ” పర్యావరణం పరిరక్షణ – మన బాధ్యత” అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ యాదవ్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య హాజరై మాట్లాడుతూ ప్రతి విద్యార్థి బాధ్యతగా పరిసరాలతో పాటు ఇంటిదగ్గర పరిశుభ్రతను పాటించాలని తద్వారా అంటూ వ్యాధులు ప్రబలకుండా ఉండి ఆరోగ్యంగా జీవించాలని తెలిపారు. అలాగే తడి, పొడి చెత్తను వేరుచేసి విధిగా మీ గ్రామాలలో గాని లేదా మున్సిపల్ పరిధిలోని చెత్త సేకరణ కార్మికులకు అప్పగించాలని తెలియజేశారు. తర్వాత పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ మాట్లాడుతూ పరిసరాలతో పాటు పర్యావరణానికి హానిచేసే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి తమ వంతుగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. అలాగే విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంపొందించడంతో పాటుగా సామాజిక బాధ్యతను పెంపొందించుకునే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు.
అనంతరం గతంలో జరిగిన స్వచ్ఛ హుజురాబాద్ కార్యక్రమంలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులను మున్సిపల్ కమిషనర్ అభినందించడంతో పాటుగా సర్టిఫికెట్స్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ తో పాటు డైరెక్టర్ తిరుపతి యాదవ్, ప్రిన్సిపాల్ సౌమ్య మరియు మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య







