
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: రాజకీయాలకు కొత్త ఒరవడి నేర్పి, ప్రజా జీవితంలో డైనమిక్ గా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా టైగర్ గా పేరొందిన మాజీ మంత్రి స్వర్గీయ ముద్దసాని దామోదర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, సీనియర్ సిటిజన్, ముద్దసాని ప్రియ శిష్యుడు పోలాడి రామారావు కొనియాడారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటూ, అర్ధ రాత్రి వరకు, రైతులతో, సామాన్య ప్రజలతో మమేకమై వారి సమస్యలు పరిష్కారానికి అవిశ్రాంతంగా కృషి చేసిన అరుదైన ఘనత దామోదర్ రెడ్డికే దక్కుతుందన్నారు.
స్వర్గీయ దామోదర్ రెడ్డి 69వ జయంతి సందర్భంగా ఆదివారం కరీంనగర్ లో సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకుల తో కలిసి ముద్దసాని చిత్ర పటానికి పోలాడి రామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ అప్పటి కమలాపూర్ నియోజకవర్గం , ఇప్పటి హుజురాబాద్ నుండి తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ్యుడిగా నాలుగుసార్లు వరుసగా గెలుపొంది దామోదర్ రెడ్డి చరిత్ర సృష్టించారని చెప్పారు. ఆయన గెలుపుకు కార్యకర్తలు, సామాన్య ప్రజలు , నామినేషన్ ఫీజు వారే చెల్లించి స్వంత ఖర్చుల తో ప్రచారం నిర్వహించే వారని అన్నారు తన ఇంటి గుమ్మం తొక్కిన సామాన్యులకు అర్ధ రాత్రి వరకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం అయ్యేవరకు అండగా నిలిచిన గొప్ప నేత డాషింగ్ డేరింగ్ డైనమిక్ మాస్ లీడర్ నిస్వార్థ నేత ముద్దసాని సేవలు చిరస్మరణీయం అని ఆయన అభిప్రాయపడ్డారు
నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావుల మంత్రివర్గంలో యువజన వ్యవహారాలు, పర్యాటక, రవాణా, సాంకేతిక శాఖల మంత్రిగా 3 సార్లు సమర్థవంతంగా విధులు నిర్వహించారని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జిగా కూడా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు దామోదర్ రెడ్డిని కమలాపూర్ కుర్రోడు అని ముద్దుగా పిలిచే వారని అన్నారు. యువతలో విపరీతమైన ఫాలోయింగ్ దామోదర్ రెడ్డికి ఉండేదన్నారు. ఆయన గ్రామాల్లో పర్యటిస్తే రైతులు, మహిళలు యువకులు ఎగపడి ఎదురెల్లి స్వాగతం పలికే వారన్నారు. 1985లో తొలిసారి టిడిపి నుండి పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రారెడ్డిపై విజయం సాధించిన దామోదర్ రెడ్డి ఆ తర్వాత రాజకీయాలలో వెనుతిరిగి చూసుకోలేదని చెప్పారు. 1989,1994,1999 ఎన్నికలలో వరుస విజయాలు సాధించిన ఆయన 2004 ఎన్నికల్లో పరాజయం చవిచూసారని తెలిపారు. అయినప్పటికీ ఆయన కాలం చెల్లే వరకు ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం చేసే వారని అన్నారు.
ఉమ్మడి జిల్లా మంత్రిగా జిల్లా అభివృద్ధికి ముఖ్యంగా రైతాంగ సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి మరువలేనిది అన్నారు. దామోదర్ రెడ్డి హయాంలో నియోజకవర్గ వ్యాప్తంగా కాకతీయ కాలువ పరిధిలోని ఉప కాలువలు, డిస్ట్రిబ్యూటర్ లకు లైనింగ్ నిర్మాణ పనులను చేయించి కాలువల వెంట ఉన్న ఆయకట్టు గ్రామాలకు మానకొండూర్, శంకరపట్నం, వీణవంక, హుజురాబాద్, జమ్మికుంట, కమలాపూర్ మండలాల పరిధిలోని అన్ని గ్రామాలకు బీ టీ రోడ్లు నిర్మాణం, మంచినీటి ట్యాంకులు, ఇంటింటికీ త్రాగు నీటి పైప్ లైన్ నిర్మాణములు పాఠశాల భవనాలు నిర్మాణం, చెక్ డాం లు నిర్మించి, చెరువులు, కుంటల మరమ్మతులు చేపట్టి చివరి ఆయకట్టు రైతులకు నీళ్ళు అందే విధంగా దామోదర్ రెడ్డి కాలువల వెంట నిరంతర పర్యవేక్షణ అన్ని గ్రామాల్లో పర్యటించి రైతు బాందవుడిగా, శ్రమ జీవి గా పేరు తెచ్చుకున్నారని అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించి రైతులకు అందించిన విశేష సేవలు మరువలేనివి పోలాడి రామారావు నివాళులు అర్పించారు.
ఆయన గతంలో మే 12 న 2000 సం లో నా ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ముద్దసాని అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మా స్వగ్రామమైన మాన కొండూర్ మండల పరిధిలోని మా వన్నారం గ్రామానికి రప్పించి చంద్రబాబు పర్యటన ఏర్పాటు చేశారని ఆ సభలో మా విజ్ఞప్తి మేరకు గట్టుదుద్దెన పల్లి హైవే నుంచి శెంశాబాద్, మా వన్నారం గ్రామం నుంచి ఎరడపల్లి, అర్కండ్ల, గంగారం, ఎలబాక, చల్లూర్ వరకు 14 కి. మీ. పక్కా బీ టీ రోడ్డు నిర్మాణమునకు చంద్రబాబుతో మంజూరు చేయించి దామోదర్ రెడ్డి పూర్తి చేయించారని దీంతో మానకొండూర్, శంకరపట్నం, వీణవంక, జమ్మికుంట, హుజురాబాద్ మండలాల పరిధిలోని రైతులకు ఎంతో మేలు చేకూరిందని పోలాడి రామారావు తెలిపారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఉమ్మడి జిల్లా ప్రజలకు, రైతులకు, సామాన్యుల సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేసిన దామోదర్ రెడ్డి లాంటి నాయకులు నేడు అరుదు అని పోలాడి కొనియాడారు.


దివంగత మాజీమంత్రి మద్రాసాన్ని దామోదర్ రెడ్డి (ఫైల్)

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పోలాడి రామారావు..





