
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల పక్షాన శనివారం తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబం దగ్గర మెప్పు పొందడం కోసం వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడడం కోసం కౌశిక్ రెడ్డి ఏది పడితే అది ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడని అన్నారు. ఇక్కడి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే, ప్రజలను గాలికి వదిలేసి కేసిఆర్ కి గన్మెన్ గా, కేటీఆర్ కి పిఎగా, హరీష్ రావుకు డ్రైవర్ గా పనిచేస్తున్నాడని అన్నారు. మీలా ఫామ్ హౌస్ కు పరిమితమైన ముఖ్యమంత్రి కాదనీ, ప్రజా క్షేత్రంలో ప్రజల కోసం అహర్నిశలు ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవితం తెరిచిన పుస్తకం అని ప్రజలందరికీ తెలుసని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి నేటి వరకు విద్య మీద, వైద్యం మీద, వ్యవసాయం మీద, పరిశ్రమల మీద అనేక రంగాలలో నూతన ఒరవడిని సృష్టిస్తూన్నారనీ, తెలంగాణ రాష్ట్ర ప్రజా జీవితాలలో వెలుగులు నింపడం కోసం అనునిత్యం కృషి చేస్తున్నాడని తెలిపారు. కౌశిక్ రెడ్డి నువ్వు ఎవరి మెప్పుకోసమైతే మాట్లాడుతున్నావో వారిది ఫోన్ టాపింగ్ చరిత్రనీ, బిఆర్ఎస్ పార్టీ వాళ్లు ఇవాళ దొంగే, దొంగ-దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కౌశిక్ రెడ్డి ఇకనైన చిల్లర రాజకీయాలు మానకపోతే, రానున్న రోజుల్లో భౌతిక దాడులకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల ఉపాధ్యక్షులు దేవనూరి వినయ్, ఆకినపల్లి శ్యామ్, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, కార్యదర్శి యేభూషి అజయ్, యువ నాయకులు బండి పవన్, సల్మాన్, శివ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్





