
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పర్యావరణం పై ప్రభావం చూపే అంశాలకు దూరంగా ఉంటూ పర్యావరణాన్ని కాపాడడం మన ధర్మం అని హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య అన్నారు. మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బల్దియా ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన రంగురంగుల విగ్రహాలు చూపుకు బాగున్నప్పటికీ పర్యావరణానికి వాటి వల్ల నష్టం కలుగుతుందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజించాలని అన్నారు. గణపతి నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ముందుగా పూజారి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి ఉచిత మట్టి వినాయకుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, పూజారి పందిళ్ళ భాస్కరశర్మ, సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, రోంటాల సుధీర్, ప్రతాప రాజు, ఆరెల్లి రమేష్, అనిల్, సాయి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.


ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్న మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, పాల్గొన్న పురోహితుడు భాస్కర్ శర్మ..





