
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ జామే మజీద్ అండ్ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సౌదీ అరేబియాలోని మక్కా ఉమ్రా ని దర్శించుకునేందుకు వెళ్తున్న సందర్భంగా ఆయనకు అభిమానులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, తోటి ఉద్యోగులు సన్మానాలు వెల్లువలా చేశారు. మైనారిటీ నాయకులు కొందరు ఇంటి వద్ద మరికొందరు మసీదు వద్ద మరికొందరు కమిటీ కార్యాలయం వద్ద పూలమాలవేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు, ముస్లిం మైనార్టీ నాయకులు వేరువేరుగా పూలమాలలు వేసి శాలువాలు కప్పి స్వీట్ తినిపించి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పాడిపంటలతో పిల్లాపాపలతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ అల్లాను ప్రార్థించాలన్నారు. ప్రతి ముస్లిం తన జీవితంలో ఒక్కసారి అయినా మక్కాకి వెళ్లి రావాలని పెద్దలు చెబుతుంటారని, దర్శనానికి వెళ్తున్న ముజాహిద్ హుస్సేన్ కు దేవుడి కటాక్షం కలగాలని కోరుకున్నారు. అలాగే రాష్ట్రంలోని మైనారిటీ సోదరుల తరఫున కూడా అక్కడ ప్రార్థనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. విదేశీ పర్యటనకు వెళ్తున్న ముజాహిద్ హుస్సేన్ క్షేమంగా వెళ్లి అందరి తరపున ప్రత్యేక ప్రార్థనలు చేసి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు, మసీద్ అండ్ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీల అధ్యక్షులు అసోసియేషన్ నాయకులు, రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.





















అధికారుల నుండి ప్రజాప్రతినిధులు మొదలుకొని నాయకుల వరకు అన్ని వర్గాల నాయకుల సన్మానం పొందుతున్న ముజాహిద్ హుస్సేన్ దృశ్యమాలిక.





