
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఎస్ ఆర్ ఎస్ పి డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు చొల్లేటి కిషన్ రెడ్డి(63) శుక్రవారం రాత్రి గుండెపోటుతో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం స్వగ్రామమైన పోతిరెడ్డిపేటలో ఆకస్మికంగా మరణించారు. కిషన్ రెడ్డి భార్య లావణ్య గతంలో పోతిరెడ్డిపేట గ్రామంకు సర్పంచ్ గా సేవలందించారు. కిషన్ రెడ్డి పలుమార్లు గతంలో నీటి సంఘం అధ్యక్షులుగా, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గా, కాంట్రాక్టర్ గా రైతులకు, ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థాయిలో రెండవ విడత జన్మభూమి కార్యక్రమాన్ని ఇదే గ్రామం నుండి ఆయన సతీమణి లావణ్య (రమాదేవి) సర్పంచ్ గా ఉన్న కాలంలో ప్రారంభించి గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించడం గతంలో రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఎస్ ఆర్ ఎస్ పి మాజీ సీఈ సానా మారుతికి ఎంతో అత్యంత ఆప్తుడిగా ఉండేవాడు, అన్ని పార్టీల నేతలతో సంబంధాలు కలిగి ఉన్న నేతగా ప్రత్యేక గుర్తింపు కలదు. రాత్రి బంధువుల పెళ్లికి హాజరై డిజె సౌండ్ లో నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎంతో చలాకీగా అందరితో కలివిడిగా ఉండే కిషన్ రెడ్డి ఆకస్మాత్తుగా అర్ధరాత్రి గుండెపోటుతో మరణించడం హుజురాబాద్ ప్రాంతంతోపాటు జిల్లాలోనే తీవ్రవిషాధాన్ని నింపింది. ఆయన మృతికి మాజీ ఎంపీ లక్ష్మీకాంతారావు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ మంత్రి ఇ పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వోడితేల సతీష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వోడితెల ప్రణవ్, సింగిల్ విండో చైర్మన్లు ఎడవల్లి కొండల్ రెడ్డి, హనుమండ్ల శ్యాంసుందర్ రెడ్డి, కౌరు సుగునాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు, మాజీ మున్సిపల్ చైర్మన్లూ, మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

చొల్లేటి కిషన్ రెడ్డి..(ఫైల్)





