
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

హుజూరాబాద్ నవంబర్ 19:అమాయక నక్సలైట్ల ప్రాణాలతో రాజకీయ లాభాలు చూసే అర్బన్ నక్సల్స్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. బుధవారం హుజురాబాద్లో జరిగిన బూత్ అధ్యక్షులు, కార్యదర్శుల సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.అడవుల్లో దళిత–గిరిజన యువకులు మావోయిస్టుల పేరుతో మరణిస్తుంటే, వారిని రెచ్చగొట్టే అర్బన్ నక్సల్స్ మాత్రం కమిషన్ పోస్టులు, నామినేటెడ్ హోదాలు, ఆస్తులు అనుభవిస్తున్నారని మండిపడ్డారు. ‘‘ప్రతి మరణం వెనుక ఎన్ని కుటుంబాలు ఛిద్రమవుతున్నాయో ఈ అర్బన్ నక్సల్స్కి తెలుసా?’’ అని ప్రశ్నించారు. సిద్ధాంతాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం పేరుతో మాట్లాడే అర్బన్ నక్సల్స్… కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినా మౌనంగా పదవుల్లో ఎందుకు కొనసాగుతున్నారని ఆయన నిలదీశారు. మహిళలకు రూ.2,500, వృద్ధులకు రూ.4,000 పెన్షన్, ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి అమలుకాలేదని మండిపడ్డారు.మావోయిజానికి బీజేపీ ఎప్పటినుంచో వ్యతిరేకమని, ‘‘తుపాకీతో రాజ్యాధికారం సాధ్యం కాదు… ప్రజలు అంగీకరించరు’’ అని స్పష్టం చేశారు. అమాయక మావోయిస్టుల మరణాలకు అర్బన్ నక్సల్స్నే బాధ్యులని అన్నారు.దేశ ఆర్థిక వ్యవస్థను నాలుగో స్థానానికి తీసుకెళ్లడంలో ప్రధాని మోదీ నాయకత్వం కీలకమని, ప్రపంచ నాయకులే ఆయన పనితీరును అభినందిస్తున్నారని తెలిపారు.అడవుల్లో ఉన్న మావోయిస్టులకు విజ్ఞప్తి చేస్తూ ‘‘అర్బన్ నక్సల్స్ మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. లొంగిపొండి, ప్రభుత్వ సహాయంతో సుఖంగా జీవించండి. అమిత్ షా మాట ప్రకారం మార్చిలోపు మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తాం’’ అని బండి సంజయ్ హెచ్చరించారు.


హుజురాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్..





