Oplus_16908288
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్, డిసెంబర్ 27:
తెలంగాణ ప్రభుత్వం మీడియా జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ కోసం విడుదల చేసిన జీవో 252 ను సవరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) విజ్ఞప్తి చేసింది. ఫెడరేషన్ ప్రతినిధి వర్గం శనివారం సమాచార భవన్ లో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సిహెచ్. ప్రియాంకను కలసి 252 జీవో లో తీసుకు రావలసిన మార్పులను సూచించింది. ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య, కో- కన్వీనర్లు పులిపలుపుల ఆనందం, బండి విజయకుమార్, తన్నీరు శ్రీనివాస్, కుడితాడి బాపురావులతో పాటు నాయకులు రఘురాం, పద్మనాభరావు తదితరులు కమీషనర్ తో సుదీర్ఘ చర్చలు జరిపారు. అక్రిడిటేషన్ల జీవోకు తగిన సూచనలు చేస్తూ మార్పులు
సూచించాల్సిందిగా ఫెడరేషన్ ప్రతినిధి వర్గానికి కమిషనర్ సూచించారు. డెస్క్ జర్నలిస్టులకు, రిపోర్టర్లకు వేర్వేరు రకాల కార్డులు జారీ చేయడం పట్ల ఫెడరేషన్ ప్రతినిధి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది.అదే విధంగా వార, పక్ష,మాస దినపత్రికల అర్హతకు సంబంధించి జారీ చేసిన నిబంధనలో మార్పులు తీసుకురావాలని కోరారు. వార పత్రికలకు కనీసం 45 సంచికలు పక్షపత్రికలకు కనీసం 22 సంచికలు, మాసపత్రికలకు కనీసం 11 సంచికలు సమర్పించాలన్న నిబంధనను తొలగించాలని కోరారు. ఈ విధానం పెట్టుబడిదారులకు మాత్రమే ఉపయోగపడుతుందని, న్యాయమైన జర్నలిస్టులను తొలి దశలోనే వృత్తికి దూరం చేసేందుకు ఈ జీవో తోడ్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దినపత్రికలు ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(పీఆర్ జీఐ) నుండి సర్టిఫికెట్ దాఖలు చేయాలనే నిబంధన చేర్చడం పట్ల అభ్యంతరం తెలిపారు. కేబుల్ చానళ్ళకు విధించిన కఠినమైన నిబంధనను సడలించాలని సూచించారు. జీవో 252
పాత్రికేయులపై సెన్సార్షిప్ విధించినట్లుగా ఉందని వారు పేర్కోన్నారు. జర్నలిస్టులకు విధించిన 30 సంవత్సరాల అనుభవ నిబంధనలను 15 సంవత్సరాలకు కుదించాలని కోరారు.

రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సిహెచ్. ప్రియాంకను కలసి 252 జీవో లో తీసుకు రావలసిన మార్పులను సూచిస్తు వినతి పత్రం అందజేస్తున్న నాయకులు..





