
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆర్టీసీ డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణలో తమ వంతు బాధ్యతను నెరవేర్చాలని హుజూరాబాద్ ఏసీపీ వీ మాధవి పిలుపు నిచ్చారు. శనివారం హుజూరాబాద్ ఆర్టీసీ డిపోలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఎర్రివే- ఆల్వే అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని డ్రైవర్లకు దిశా-నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు మాట్లాడుతూ.. ప్రతి డ్రైవర్ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ప్రయాణికుల క్షేమమే పరమావధిగా డ్రైవర్లు పనిచేయాలని ఆయన సూచించారు. గత 28 ఏళ్లుగా ఎటువంటి రోడ్డు ప్రమాదాలకు తావివ్వకుండా, అత్యంత నైపుణ్యంతో విధి నిర్వహణ చేస్తున్న ముగ్గురు సీనియర్ డ్రైవర్లు అయినా కొమురయ్య, పిఎస్.రావు, పిఎస్.రెడ్డిలను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. వీరి సేవలను అధికారులు ప్రత్యేకంగా కొనియాడారు. రోడ్డు భద్రత – ప్రమాదాల నివారణ అనే అంశంపై విద్యార్థినులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. బహుమతులు అందుకున్న వారిలో హుజురాబాద్ శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన ఇప్పకాయల సింధు, రష్మిత, ప్రణతి, మనస్వినిలు బహుమతులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి కరుణాకర్, సబ్ ఇన్స్పెక్టర్ యూనస్ ఖాన్, డిపో మేనేజర్ రవీంద్రనాథ్, ట్రాఫిక్ మేనేజర్ ఎల్ సారయ్య, భద్రతా సిబ్బంది, ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


సీనియర్ డ్రైవర్లను సత్కరిస్తున్న ఏసీపీ మాధవి, ఎంవిఐ వేణు తదితరులు


ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న ఏసీపీ, ఎంవిఐ, డిపో మేనేజర్ తదితరులు..





