
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్లో రోజురోజుకీ దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో రాష్ట్ర డీజీపీ సివీ ఆనంద్ ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, ఎంఎల్సీలు దేశపతి శ్రీనివాస్ మరియు దాసోజు శ్రవణ్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల కరీంనగర్లో వరుసగా జరుగుతున్న జ్యూవెలరీ షాపుల దొంగతనాలు, ప్రజలపై దాడులు, గుంపులుగా తిరుగుతూ భయాందోళనలు సృష్టిస్తున్న సంఘటనలు నగరంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ నేతలు… ఇది సాధారణ ఘటన కాదని, రాజకీయ కక్షతో బీజేపీ గుండాలు పన్నిన కుట్ర అని ఆరోపించారు. ఈ దాడుల వెనుక బండి సంజయ్ కుమార్ ప్రేరణ స్పష్టంగా కనిపిస్తోందని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడులు, కార్ల ధ్వంసం, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని భయానక వాతావరణం సృష్టించడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని మండిపడ్డారు. కరీంనగర్ ప్రజలు భయంతో జీవించే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను కాపాడడంలో పూర్తిగా విఫలమైన కరీంనగర్ సీపీని వెంటనే సస్పెండ్ చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన టూ టౌన్ సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడికి బాధ్యులైన వారిపై, అలాగే ప్రేరేపించిన బండి సంజయ్ కుమార్ పై వెంటనే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.





