
స్వర్ణోదయం ప్రతినిధి భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా అధికారి (ఆర్టీవో) కార్యాలయం ముందు సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీవో నీళ్లు వెంకన్నను బొగ్గు లారీ ఢీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందారు. వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఓ బొగ్గు లారీ ఆర్టీవో వెంకన్న పైనుంచి దూసుకు వెళ్లింది. నడుముపై నుంచి వెళ్లటం వల్ల తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే సంఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చెల్పూరులో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చెల్పూరులోని ఆర్టిఓ కార్యాలయం ఎదుట డీటీవో వెంకన్న ఈరోజు ఉదయం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ టిప్పర్ని ఆపే ప్రయత్నం చేయగా, డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని ముందుకు నడిపాడు. దీంతో టిప్పర్ నేరుగా వెంకన్నను ఢీకొట్టి, ఆయనపై నుంచి దూసుకెళ్లింది. DTO వెంకన్న తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో వెంకన్న మృతదేహం నుజ్జు నుజ్జు అయింది.

15 రోజుల కిందటే ఆయన జగిత్యాల నుంచి భూపాలపల్లికి బదిలీపై వచ్చారు. ప్రమాదం రవాణా శాఖ కార్యాలయం ఎదురుగానే జరగడంతో సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీవో సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని భూపాలపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కేవలం ప్రమాదమా లేక తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో జరిగిన నిర్లక్ష్యమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.
సంతాప ప్రకటన
భూపాలపల్లి జరిగిన రోడ్డు ప్రమాదంలో విధినిర్వహణ లో ఉన్న మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (MVI) వెంకన్న మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వెంకన్న భూపాలపల్లి రవాణా శాఖ కార్యాలయం వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించారు.
వెంకన్న మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విధినిర్వహణ లో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.






