
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలంలోని అన్ని రైతు వేదిక కార్యాలయాల్లో ఈనెల 23 నుంచి 30 వరకు జరిగే విత్తన మేళ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రోoటాల సుహాసిని కోరారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణ శివారులోని కేసి క్యాంపులోనీ రైతు వేదికలో విత్తన మేళ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.


ఈ సందర్భంగా హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ రొంటాల సుహాసిని మాట్లాడుతూ ప్రభుత్వము ప్రోత్సహిస్తున్నటువంటి 7 వరి సన్నరకం వంగడాలను పండించి ప్రభుత్వం అందించే క్వింటాల్ కు 500 రూ బోనస్ ను రైతులు పొందాలని అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులు ఆసక్తి చూపాలి అని కోరారు.

జిల్లా ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ చత్రూ నాయక్ మాట్లాడుతూ… రైతులు విత్తనాల కొనుగోలు విషయంలో మోసపోకుండా నాణ్యమైన విత్తనాలు కొని రసీదులు పొందాలన్నారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ నానో యూరియా నానో డిఏపి వాడుతూ పెట్టుబడి తగ్గించుకొని నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ దిగుబడులు పెంపొందించు కోవాలన్నారు. హుజురాబాద్ ఏడిఏ సునీత మాట్లాడుతూ… ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలి అని, ఇప్పుడు నేలలను కాపాడుతూ నేల ఆరోగ్యాన్ని సంరక్షించిరాబోయే తరాలకు మంచి నేలను అందించాలి అని అదేవిధంగా ఆరోగ్యకరమైన పంటని పండించి ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కోరారు.


ఈ విత్తన మేళాలో ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 రకాల సన్నరకం వరి విత్తనాలు పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల విత్తనాలతో పాటు రైతులకు అవసరమైన నానో యూరియా, నానో డీఏపీ వంటి ఎరువులు స్టాల్స్ రూపంలో అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరి రాజేశ్వరి, మండల వ్యవసాయ అధికారి భూమిరెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, ఏఈవోలు, డీలర్లు, రైతులు పాల్గొన్నారు.





