
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు సగం వాటా దక్కినప్పుడే సామాజిక న్యాయం సంపూర్ణమవుతుందని, మేమెంతో- మాకంతే అనే మౌలిక సూత్రాన్ని ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం పాటించాలని బీసీ దళపతి, కుల గననకై దేశవ్యాప్త కోటి ఉత్తరాల ఉద్యమ రూపకర్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ పిలుపునిచ్చారు. మంగళవారం నాడు హుజురాబాద్ కేంద్రంలో బీసీ ఉద్యమ నాయకుడు బండారి సదానందం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని బీసీ మ్యానిఫెస్టో పుస్తకాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవిలో తిరిగే పులిని వాటి అడుగుజాడలను బట్టి లెక్కిస్తారు, రోడ్డున పెరుగుతున్న చెట్లను లెక్కిస్తారు, రోడ్డుపై తిరుగుతున్న పశువులను వాటి సంఖ్య నెంబర్లను చెవులపై అంటిస్తారు, కానీ బీసీలు అంటే రాజకీయ పార్టీలకు భయమా..చులకనా… నిర్లక్ష్యమా… అని ప్రశ్నించారు. బీసీలలోని అన్ని కుల సంఘాలు ఒకే తాటిపై వచ్చి సమరం చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ బీసీ సంఘాల నాయకులు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాజీపేట శ్రీనివాస్, కూరపాటి రామచంద్రం, సంగెం శ్రీనివాస్, పంజాల వెంకటేష్, సత్యనారాయణ, నేరెళ్ల మహేందర్ గౌడ్, శ్రీనివాస్, గాలి సమ్మయ్య, పుల్ల రాధ తదితరులు పాల్గొన్నారు.





