
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక పరస్పరం ఆరాధన, సామరస్యంతో మన గౌరవానికి నిలువెత్తు నిదర్శనం బోనాల జాతర. అలాంటి జాతర సంబరాలను కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు డీజే, భక్తి నృత్యాలతో మరియు విద్యార్థినిలు బోనాలు, పోతురాజుల వేషాధారణ ఊరేగింపుగా అంబేద్కర్ చౌరస్తా వరకు తీసుకెళ్లడం పలువురుని ఆకట్టుకుంది. అనంతరం ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంప్రదాయాలను చాటిచెప్పారు.


బోనాల పండుగ విశిష్టత, తెలంగాణ ప్రజల ఆచార సంప్రదాయాలు, అమ్మవారి పట్ల భక్తి విశ్వాసాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి, బోనాలను అలంకరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ జానపద సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడం కూడా విద్యాసంస్థల బాధ్యత అని అన్నారు. తెలంగాణ బోనాల పండుగ మన సంస్కృతికి, గ్రామీణ జీవన విధానానికి అద్దం పడుతుందని పేర్కొన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు మాట్లాడుతూ విద్యార్థులు మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ భవిష్యత్ తరాలకు వాటిని అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.





