
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : గెలిచి ఆరు నెలలైనా మునిసిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టక పోవడం, తనకు నచ్చినట్లుగానే ప్రవర్తిస్తున్న చైర్ పర్సన్ తీరుపై అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. చైర్ పర్సన్ రోంటాల సుహాసిని తీరును నిరసిస్తూ కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజీపి కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు. మంగళవారం మున్సిపల్ సర్వసభ్య సమావేశం చైర్ పర్సన్ రోoటాల సుహాసిని అధ్యక్షతన ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే పలువురు కౌన్సిలర్లు గత కొన్ని రోజులుగా తీసుకున్న పలు తీర్మానాలు ఇప్పటివరకు అమలు కాలేదనీ నిలదీశారు.


పట్టణంలోని అభివృద్ధి పనులు, పారిశుధ్యం తదితర సమస్యలపై కౌన్సిలర్లకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కౌన్సిలర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కమిషనర్, చైర్పర్సన్లు ఏకపక్షంగా అజెండా తయారు చేసి పంపించడం సరికాదని కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సమాధానాలు ఇవ్వకుండా దాటవేయడం, పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హుజురాబాద్ పట్టణంలో అభివృద్ధి, పారిశుధ్యం, ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయన్నారు..
సమస్యలపై అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాలని, అన్ని పార్టీల కౌన్సిలర్లను కలుపుకొని ముందుకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించాలని కోరామని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చైర్పర్సన్ సుహాసిని వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రజల సమస్యల పరిష్కారం కోసం అందరిని కలుపుకొని చైర్ పర్సన్ ప్రజలకు సేవలు అందించాలని వారు డిమాండ్ చేశారు.




