
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం, పోలీసులకు ప్రజలకు మధ్య సంబంధాన్ని దగ్గర చేయడం కోసమే కార్డెన్ సెర్చ్(కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం) నిర్వహిస్తున్నట్లు హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి అన్నారు.

బుధవారం తెల్లవారుజామున హుజురాబాద్ పట్టణంలోని బుడగ జంగాల కాలనీ, గణేష్ నగర్లలో పోలీసులు ఇల్లిల్లు తిరిగి తనిఖీలు నిర్వహించారు. ఆ ప్రాంతంలో కొత్తగా ఉన్న వ్యక్తులను, అనుమానితులను ప్రశ్నించారు. వారి వద్ద నుండి వివరాలను సేకరించారు. నెంబర్ లేని సుమారు 100 వాహనాలను పోలీసులు పట్టుకున్నారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. పోలీసులు ప్రజల్లో ఒకరని, ప్రజలు కూడా యూనిఫాం లేని పోలీస్ అని అన్నారు. అకస్మాత్తుగా పోలీసులు తనిఖీలు చేయడం వల్ల ఈ ప్రాంతంలో సంబంధం లేని వ్యక్తులు ఉండడానికి భయపడతారని చెప్పారు. అలాంటి వ్యక్తుల వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయ అని అన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు జరగకుండా అడ్డుకట్ట వేయవచ్చని, ఒక సీసీ కెమెరా ఎంతోమంది పోలీసులతో సమానం అని అన్నారు. అవసరమైన వారు తమ ఇంటి వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు తీసుకునే చర్యలకు ప్రజలు సహకరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ సిఐలు టీ కరుణాకర్, వి శ్రీనివాస్ జమ్మికుంట సిఐలు రామకృష్ణగౌడ్, పులి వెంకట్ గౌడ్, ఎస్ఐలు రవి, స్వాతి, పోలీసులు పాల్గొన్నారు.





