
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే సహించే ప్రసక్తే లేదని, వారి కలం కదిలినా..గళం గర్జించినా ఆ ఉధృతిని పాలకులు, కుట్రదారులు ఎవరూ తట్టుకోలేరని బీసీ జేఏసీ గౌరవాధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అర్హులైన జర్నలిస్టులకు తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని, కోర్టులో వేసిన అక్రమ కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారం నాటికి ఏడో రోజుకు చేరుకుంది.


ఈ సందర్భంగా స్థానిక కళాకారులు తమ ఉద్యమ గీతాలు, ఆటపాటలతో ధర్నా శిబిరాన్ని హోరెత్తించారు. అనంతరం జర్నలిస్టులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి, ప్రజాప్రతినిధులు, అధికారుల మొండి వైఖరికి వ్యతిరేకంగా నినదిస్తూ నిరసన గళం విప్పారు. అక్రమ కేసులపై నిప్పులు చెరిగిన వక్తలు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ సంఘీభావం తెలిపిన చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ..

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై స్వామిరెడ్డి కావాలనే కుట్రపూరితంగా కేసులు వేసి అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఆ పిటిషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే జర్నలిస్టులు నేడు తమ కనీస హక్కులైన ఇళ్ల స్థలాల కోసం రోడ్డెక్కి అర్ధనగ్నంగా నిరసన తెలపాల్సి రావడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటన్నారు.
గతంలో నియోజకవర్గంలో తీవ్రంగా మారిన డంప్యార్డ్ సమస్యను స్థానిక నాయకులు ఏ విధంగానైతే చొరవ చూపి పరిష్కరించారో, అదే చిత్తశుద్ధితో జర్నలిస్టుల సమస్యను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బయట విమర్శలు మానుకుని అధికారిక వేదికలపై చర్చించి శాశ్వత పరిష్కారం చూపాలని, స్థలాల కేటాయింపులో ఏవైనా చిన్నచిన్న సాంకేతిక లోపాలుంటే జర్నలిస్టులే సరిదిద్దుకుంటారని స్పష్టం చేశారు. సమస్య తేలేవరకు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని తేల్చిచెప్పారు.


సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఉద్యోగ సంఘాలు
కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి వీరస్వామి, మండల కార్యదర్శి కోయల్ కార్ దుర్గాజి కూడా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య రక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఇళ్ల స్థలాలు కేటాయించకపోతే, ప్రజాసంఘాలన్నింటినీ ఏకం చేసి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్షలో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.





