
-ఎంబీబీఎస్ చదివించిన కేసీఆర్ పీజీ కోర్సుకు కి కూడా ఆర్థిక మద్దతు.
- కిష్టయ్య కుటుంబంతో కలిసి భోజనం చేసిన కేసీఆర్
- అమ్మను కష్టపెట్టకుండా చూసుకోండి – కిష్టయ్య పిల్లలకు బాధ్యత గుర్తు చేసిన కేసీఆర్
- మమ్మల్ని ఆదుకుంటూ..కేసీఆర్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. – ధన్యవాదాలు తెలిపిన కిష్టయ్య కుటుంబం
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:
తెలంగాణ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. కిష్టయ్య ప్రాణత్యాగంతో కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి నేనున్నానని ఆనాడే మాట ఇచ్చిన కేసీఆర్, ఇచ్చిన మాటను నిలుపుకుంటూ వస్తున్నారు. కిష్టయ్య మరణం నాటికి ఆయన కొడుకు కూతురు చిన్నపిల్లలు. వారి చదువుతో సహా ప్రతి కష్టకాలంలో అండగా నిలుస్తూ వచ్చారు. వారి కుటుంబానికి గుండె ధైర్యమిస్తూ వారి బాగోగులు చూసుకొంటున్న కేసీఆర్, నాడు కిష్టయ్య బిడ్డ ఎంబీబీఎస్ వైద్య విద్యకోసం అవసరమైన ఆర్థిక సాయం అందించారు. నాడు ఎంబీబీఎస్ పూర్తిచేసుకున్న కిష్టయ్య బిడ్డ ప్రియాంక ఇప్పుడు పీజీ చదువుతున్నది. అందుకు మెడికల్ కాలేజీలో కట్టాల్సిన ఫీజుకోసం కావలసిన 24 లక్షల రూపాయల చెక్కును నేడు కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ అందించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కొడుకు రాహుల్ చేస్తున్న ఉద్యోగం గురించి కేసీఆర్ ఆరా తీశారు. వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు.


