
-అనాధలైన చిన్నారులిద్దరూ..
-చందాలతో అంత్యక్రియలకు కుటుంబం ఎదురుచూపు..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: క్యాన్సర్ రఘు ప్రాణాన్ని కబలించింది. ఎంతో సంతోషంగా ఉంటున్న ఆ కుటుంబాన్ని దేవుడు చిన్నచూపు చూశాడు. అల్లారుముద్దుగా ఉన్న తమ ఇద్దరు పిల్లలను చూసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆ తండ్రిని క్యాన్సర్ అనే మహమ్మారి అనతి కాలంలోనే కబళించింది. దీంతో ఆ కుటుంబం చిన్నాభిన్నమయింది. పిల్లలు ఇద్దరు తండ్రి లేని అనాధలయ్యారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో నివసించే గాజుల రఘు (38) గత కొన్నాళ్ళుగా క్యాన్సర్ తో పోరాడుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. రఘు ఓ ప్రైవేట్ కళాశాలలో బోధన చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. రఘు తండ్రి సోడాలు అమ్ముతూ కుటుంబానికి ఆసరాగా నిలిచేవారు. అతను కూడా అనారోగ్యం పాలయ్యారు. రఘు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాధం నెలకొంది. ఆ కుటుంబానికి పెద్దదిక్కు కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం కొట్టుమిట్టాడుతుంది. రఘుకు సంవత్సరం పాప, రెండు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. చేతిలో ఉన్న డబ్బులు రఘు చికిత్సకు అయిపోగా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో అంత్యక్రియలు సైతం నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. దీంతో దాతలు బంధువులు చందాలు వేసుకుని అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత మే 29న స్వర్ణోదయం పత్రికలో పబ్లిష్ అయిన వార్తకు స్పందించి పలువురు దాతలు చిన్న మొత్తంలో నామమాత్రంగా ఆర్థిక సాయం చేయగా కుటుంబ జీవనోపాధికి కూడా సరిపోలేదు. ఇప్పుడు పెద్ద ఉపద్రవం వచ్చి పడడంతో ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం, ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజా ప్రతినిధులు కానీ ప్రభుత్వం గానీ ముందుకు వచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారికి ఆర్థిక సహాయం చేయాలనుకునే ఉదార స్వభావం కలిగిన దాతలు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఆర్థిక సాయం అందించాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఫోన్ పే, గూగుల్ పే 9966008681 ( గాజుల రఘు) భార్య రజిత కు చెల్లుబాటు అవుతాయి. కనుక దాతలు సకాలంలో స్పందించి ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.






