
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
తెలంగాణ ఉద్యాన& వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి లోహియా ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆయిల్ పామ్ పంట సాగు చేస్తున్న హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి గ్రామంలో రైతు క్షేత్ర ప్రదర్శన మరియు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్రం ఆయిల్ పామ్ సాంకేతిక సలహాదారు డాక్టర్ యాగాస్ రంగనాయకులు మాట్లాడుతూ రాబోయే తరాలకు ఆయిల్ పామ్ సాగు బంగారు భవిష్యత్తుకు నాంది పలకనుందని తెలిపారు. ఈ పంట సాగు వల్ల రైతులకు మంచి నికరాదాయం లభించి ఆర్థికంగా రైతు బలపడే అవకాశం ఉందన్నారు. పంట కొనుగోలు గురించి రైతులకు ఎలాంటి సందేహలు అవసరం లేదని తెలంగాణ ఆయిల్ పామ్ చట్టం 1993 రైతులకు బ్రహ్మస్త్రం గా ఉందని పేర్కొన్నారు. అంతే కాకుండా లోహియా కంపెనీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వంతరావుపేట గ్రామంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకై 30 ఎకరాల స్థలం కొనుగోలు చేయడం జరిగిందని త్వరలోనే రైతులందరి సమక్షంలో శంకుస్థాపన చేయడం జరుగుతుందని ప్రకటించారు. అదే గ్రామానికి చెందిన కన్నబోయిన మహేందర్ యాదవ్ ని ఉత్తమ రైతుగా గుర్తించి ఘనంగా సత్కరించారు.
ఇందులో భాగంగా కెవికె జమ్మికుంట శాస్త్రవేత్త వేణుగోపాల్ మాట్లాడుతూ ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ పంట వల్ల రైతుకు లాభం చేకూరే అవకాశం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి వి అయిలయ్య, కరీంనగర్ జిల్లా రీజినల్ మేనేజర్ కె విజయభరత్, మాజీ సర్పంచ్ ఎడ్ల విజయ్ కుమార్, క్లస్టర్ ఏఈవో అనూష, ఆయిల్ పామ్ కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్ వేణు మరియు సిర్సపల్లి రైతులు పాల్గొన్నారు.

