
స్వర్ణోదయం ప్రతినిధి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు కొనసాగగా.. చంద్రబాబు కేబినెట్లో ఆయనకు మంత్రిగా చోటు దక్కడంతో అచ్చెన్నాయుడు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుండి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన పల్లా శ్రీనివాసరావుకు చంద్రబాబు ఏపీ టీడీపీ పగ్గాలను అప్పగించారు. కాగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు కొనసాగనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించిన అనంతరం మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబు నాయుడుని శ్రీనివాసరావు కలిసి పుష్ప గుచ్చాలు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు.






