
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ జూన్ 14 :
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పై అసత్య ఆరోపణలు చేయడం మాని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తక్షణమే మంత్రికి క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు, జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం హుజురాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో బీసీ సంఘం నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. పొన్నం ప్రభాకర్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, కౌశిక్ రెడ్డి ఖబర్దార్ అంటూ హెచ్చరించారు, సింగరేణి నుండి ఖమ్మంకు తరలి పోతున్న ఫ్లైయాష్ బూడిదకు మరియు లారీల ఓవర్ లోడ్ కు పొన్నం ప్రభకర్ కు సంబంధం ఉందని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. కౌశిక్ రెడ్డి ఏదో విధంగా వార్తల్లో కెక్కాలనే దురాలోచనతో బిసి మంత్రి మీద అగ్రవర్ణాల పెత్తనాన్ని ప్రయోగిస్తే బాగుండదని హెచ్చరించారు. పొన్నం ప్రభాకర్ గౌడ్ కృషి, పట్టుదలతో పైకి వచ్చాడని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని కోరుకునే నాయకుడని అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రేకు గురైన ఉద్యమము చేసిన గొప్ప నేత అని ఆ సమయంలో ఆంధ్ర నేతలతో కలిసి మానుకోటలో ఉద్యమకారులపై రాళ్లు విసిరిన చరిత్ర ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అని ఆయన గుర్తు చేశారు. అవినీతి ఆరోపణలు లేని మచ్చలేని నాయకుడు మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే, ఉద్యోగాల పేరిట లక్షలాది రూపాయలు వసూల్ చేసి, ఇసుక దందా నడిపిన నీచ చరిత్ర కౌశిక్ రెడ్డి దన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ మాట్లాడుతూ బిసి నాయకులపై అవాక్కులు, చవాక్కులు పేలితే నియోజకవర్గంలో తిరగనివ్వ బోమని, గతంలో కూడా బీసీలను కులం పేరుతో దూషించి, దాడి చేసిన నీచ బుద్ధి ఇకనైనా కౌశిక్ మాను కోవాలన్నారు. ఎంఎల్ఏ గా గెలిపించకుంటే కుటుంబ సభ్యులతో సహా విషం తాగి చస్తామని బ్లాక్ మెయిల్ రాజకీయాలతో గెలిచిన సంగతి మరువ వద్దన్నారు.. రాబోయే కాలంలో మీ పద్ధతి మార్చుకోకుంటే బహుజన బిడ్డలు నీకు తగిన బుద్ది చెపుతారని కౌశిక్ రెడ్డి ని హెచ్చరించారు. ఈ సమావేశంలో బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నారొజు రాకేష్ చారి, బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాచర్ల ఆంజనేయులు,
జిల్లా ఉపాధ్యక్షులు దాసరి రామ్మూర్తి గౌడ్, బీసీ సంఘం నాయకులు గంప వెంకన్న, మోత్కూరి శ్రీనివాస్, కొలిపాక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

