
-కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో భాగంగా వివాహం చేసుకున్న వారికి ఇస్తానన్న తులం బంగారం కూడా వెంటనే ఇవ్వాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం హుజురాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన పలువురికి చెక్కులు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడారు. కేసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద కుటుంబాల పెళ్లిళ్ల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని, చాలామంది జీవితాల్లో ఆసరా అయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పేరిట లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వము వచ్చిన తర్వాత వేల పెళ్లిళ్లు జరిగాయని వారందరికీ తులం బంగారం ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. అనంతరం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అర్హులందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మునిసిపల్ చైర్పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, మరియు పలువురు కౌన్సిలర్లు, హుజురాబాద్ సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి, తాసిల్దార్ కనకయ్య, ఎంపీడీవో సునీత, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వివిధ శాఖల అధికారులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.








