
-చేనేత దుస్తులను ధరించి నేతన్నలను కాపాడుకుందాం…
-జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: చేనేత రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రంలోని బిజెపి మోదీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పేర్కోన్నారు. హుజురాబాద్ మండలం శాలపల్లిలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను స్థానిక బిజెపి శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించగా ముందుగా కృష్ణారెడ్డి నేత కార్మికుని బొమ్మకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. చేనేత వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి 2015 ఆగస్టు ఏడవ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అధిక నాణ్యత గల చేనేత ఉత్పత్తుల బ్రాండింగ్ కోసం ప్రధాని మోదీ భారత చేనేత బ్రాండ్ ను ప్రారంభించారని తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా చేనేత రంగాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో నేత కార్మికుల సంక్షేమం కోసం 4 ముఖ్యమైన పథకాలను అమలు చేస్తుందన్నారు. ముఖ్యంగా జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్ హెచ్ డి పి), సమగ్ర చేనేత క్లస్టర్ అభివృద్ధి పథకం (సి.హెచ్. సి.డి.ఎస్), చేనేత కార్మికుల సమగ్ర సంక్షేమ పథకం (హెచ్ డబ్ల్యు సి డబ్ల్యూ ఎస్), నూలు సరఫరా పథకాలను తీసుకు వచ్చిందన్నారు. అలాగే హత్కర్గా సంవర్ధన్ సహాయత (హెచ్ ఎస్) ప్రోగ్రాం కింద చేనేత ఉత్పత్తుల మెరుగైన ఉత్పాదక, నాణ్యత ద్వారా ఆదాయాన్ని పెంపొందించడానికి వీలుగా చేనేత కార్మికులకు మగ్గాలు, ఉపకరణాలు అందించే లక్ష్యంతో 2016 డిసెంబర్ ఒకటో తేదీన ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ముఖ్యంగా ఈ పథకం కింద మగ్గం అనుబంధ ఖర్చులో 90 శాతం భారత ప్రభుత్వం భరిస్తుందని, మిగిలిన 10 శాతం లబ్ధిదారులు భరించాల్సి ఉంటుందన్నారు. భారత ప్రభుత్వ వాటా చేనేత కార్మికుల సేవా కేంద్రం ద్వారా సరఫరాదారులకు విడుదలవుతుందన్నారు. అలాగే జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నైపుణ్య అభివృద్ధి, హత్ కార్గ సంవర్ధన్ సహాయత, ఉత్పత్తి అభివృద్ధి, సాధారణ సౌకర్యాల కేంద్రం (సి ఎఫ్ సి) తదితర కార్యక్రమాల కోసం బి ఎల్ సి కి రెండు కోట్ల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని, జిల్లాస్థాయిలో ఒక ” డై హౌస్”ఏర్పాటుకు 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధి కోసం కట్టుబడి పని చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పనిచేస్తుందన్నారు. చేనేత రంగాన్ని, నేత కార్మికుల సమస్యలను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. నేత కార్మికులు ఉపాధి కోసం రోడ్డెక్కిన కనికరం చూపలేని పరిస్థితిలో రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండడం దారుణమన్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో చేనేత రంగానికి, నేత కార్మికులకు ఉపాధి లేక ఆందోళన చెందుతున్నారని, వాళ్ల సమస్యను పరిష్కరించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందన్నారు. నేత కార్మికుల సంక్షేమ అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు రాముల కుమార్, జిల్లా ఉపాద్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్, ఓబీసి మోర్చా మండల అధ్యక్షులు మండల సాయిబాబా, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్, బూత్ అద్యక్షులు వెల్పుల కుమార్, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బండారి లావణ్య, పద్మశాలి సంఘం అద్యక్షులు జడల చిరంజీవి మరియు భారతీయ జనతా పార్టీ మండల నాయకులు, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.

