
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: శ్రావణమాసం పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజున హిందువులు వరలక్ష్మీ వ్రతంను మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రావణమాసంలో మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా మహిళలు తమ ఇళ్ళను శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి విగ్రహాన్ని మంటపంలో ప్రతిష్టించి చక్కగా అలంకరింపజేసి భక్తిశ్రద్ధలతో పసుపు కుంకుమలు, పిండివంటలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని వేడుకున్నారు. సాయంత్రం మహిళలు ఒకరింటికి ఒకరు వెళ్లి పసుపు కుంకుమలు ఇచ్చిపుచ్చుకున్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని కన్యకా పరమేశ్వరి, సంతోషిమాత, ఆంజనేయస్వామి, రామాలయం తదితర దేవాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ సంఖ్యలో మహిళలు దేవాలయాలకు రావడంతో భక్తులతో దేవాలయాలన్నీ కిటకిటిలాడాయి.






