
- తలకు తీవ్ర గాయాలతో ప్రాణాపాయస్థితిలో పూజారి దివ్యానందు
–దాతల ఆర్థిక సాయంతోనే బ్రతికి బట్ట కడతాడు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన పూజారి డింగరి నవ్యానందు (29) (నందు అయ్యగారు) గణపతి నవరాత్రి ప్రతిష్ఠ చేసి వస్తుండగా, మార్గమద్యలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. శనివారం నందు అయ్యగారు ఎరుకలగూడెం గ్రామంలో గణపతి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ముగించుకుని రాత్రి 9.30 లకు ఇంటికి వెళుతూ ఉండగా, మార్గ మద్యలో కుక్కలు వెంటబడి పూజారి ద్విచక్ర వాహనం మద్యలో ఇరుక్కోవడంతో ఒక్కసారిగా కింద పడిపోయాడు. దీంతో తలకు బలమైన గాయాలై మెదడులో తీవ్ర రక్తస్రావమైంది. చికిత్స కోసం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆపరేషన్ కోసం రూ.12 నుంచి రూ.13 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. పేదరికంలో ఉన్న పూజారి బంధువులు ఆపరేషన్ కోసం కొంత ఆర్ధిక సాయం చేయగా అంత పెద్ద మొత్తంలో పోగు కాలేదు. మనసు ఉన్న మహారాజులు దాతలు ఉదార స్వభావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువ పూజారికి ఆర్థిక సాయం చేసి ప్రాణాలు కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. పూజారి డింగరి నవ్యానందుకు భార్యా, రెండు నెలల కూతురు ఉన్నారు. ఫోన్ పే చేయాల్సిన దాతలు (తన సోదరుడు డింగరి పృథ్వీ ఫోన్ పే నెం. 9908880600)కి ఆర్థిక సాయం చేసి నిండు ప్రాణాన్ని అతని కుటుంబాన్ని కాపాడాలని గ్రామస్తులు, తోటి పూజారులు వేడుకుంటున్నారు.







