
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సమాజంలో మానవ విలువలు తగ్గి, మనుషులు మానవత్వం కోల్పోతున్న సమయంలో ఓ నిరుపేద కుటుంబంలో ఆ కుటుంబ(పెద్ద) పోషకుడు మరణిస్తే మేమున్నామంటూ హుజురాబాద్ పోలీసులు ముందుకు వచ్చి తమ పెద్దమనస్సును చూపడం పట్ల స్థానిక ప్రజలంతా శభాష్ పోలీసు అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హుజురాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లి గ్రామంలో ఓ నిరుపేద మృతి చెందితే ఇంటి ఓనరు చీదరించుకోవడంతో నెలకొన్న హృదయ విదారక ఘటన విషయం విధితమే!. ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన కోట లక్ష్మణ్ మంగళవారం అనారోగ్యంతో మరణిస్తే గ్రామస్తులంతా కలిసి దహన సంస్కారాలు నిర్వహించారు. హుజురాబాద్ పోలీసులు కూడా మేమున్నాం అంటూ ఆ కుటుంబానికి అండగా నిలిచారు. గురువారం ఏసీపీ శ్రీనివాస్ జీ ఆద్వర్యంలో లక్ష్మణ్ కుటుంబానికి నిత్యవసర వస్తువులతో పాటు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ జీ మాట్లాడుతూ లక్ష్మణ్ ఘటన తమను చాలా బాధకు గురి చేసిందని అన్నారు. లక్ష్మణ్ కుటుంబానికి అండగా ఉంటామని వారి పిల్లల చదువుకు పోలీసుల తరఫున సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ తో పాటు పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.




.





