
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మనిషి తన జీవితంలో సహనం కోల్పోవద్దని సన్మార్గంలో నడవాలని, మంచి జీవితానికి సూచికలుగా వీటిని భావించాలని హుజురాబాద్ కోర్టు న్యాయమూర్తి పాలడుగు అలేఖ్య అన్నారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని సబ్ జైలులో గాంధీ జయంతి సందర్భంగా ఖైదీల సంక్షేమ దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. క్షణికావేశంలో మనం చేసిన తప్పులు మన జీవితానికి ముప్పుగా పరిణమిల్లుతాయని అన్నారు. ఒక పని చేసే ముందు ఒక్క క్షణం ఆలోచిస్తే తప్పు జరగదని ఆమె అన్నారు. గాంధీ మార్గం మన జీవితానికి మంచి చేస్తుందని అన్నారు. అహింసతోనే ఆయన మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన విషయాన్ని మరిచి పోరాదని అన్నారు. అనంతరం సబ్ జైల్ పర్యవేక్షణ అధికారి నాంపల్లి దేవేందర్ మాట్లాడుతూ… గాంధీ మార్గమే నేటి తరానికి ఆదర్శంగా ఉండాలన్నారు. హుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ మాట్లాడుతూ…. మనిషి పశ్చాత్తాప పడ్డప్పుడు జీవితంలో మార్పు వస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల పరిరక్షణ కమిటె జాతీయ అధ్యక్షులు ప్రజాకవి నాగుల సత్యం గౌడ్ మాట్లాడుతూ మనిషి శాంతి స్వభావంతో నడుచుకొని సమాజ అభివృద్ధి కోసం పాటుపడినప్పుడే సార్థకత ఏర్పడుతుందని అన్నారు. క్షణికావేశంలో తప్పులు చేసి తిప్పలు పడవద్దని సూచించారు. ఈ సందర్భంగా తన కవితను సత్యం గౌడ్ న్యాయమూర్తి అలేఖ్యకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జైలు సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.







