
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: తెలంగాణ పల్లెల్లో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో సంతోషాలతో జరుపుకునే బతుకమ్మ పండుగ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బతుకమ్మ పండుగ మొదటిరోజున ఎంగిలిపూల బతుకమ్మగా జరుపుకోవడం అలవాయితీ. ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలో మహిళలు సాయంత్రం బతుకమ్మలను తలపై పెట్టుకుని పట్టణంలోని శివరామాలయం వద్దకు చేరుకున్నారు అక్కడ బతుకమ్మ చెట్టు వద్ద ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ పాటలు పాడుతూ ఆడుకున్నారు. అనంతరం గౌరమ్మ తల్లిని తమ కుటుంబాన్ని మాంగల్యాన్ని చల్లగా చూడాలని వేడుకున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని అన్ని వార్డుల్లో మున్సిపల్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. శివాలయం వద్ద రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. విద్యానగర్లో, సిద్ధార్థనగర్,కొత్తపల్లి నాగేంద్ర స్వామి దేవాలయం వద్ద, బోర్నపల్లి పోషమ్మ గుడి వద్ద బతుకమ్మల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. పండుగను పురస్కరించుకొని బోర్ణపల్లి, కొత్తపల్లి ఇంద్రనగర్, ఇప్పల్ నర్సింగాపూర్, దమ్మక్కాపేట లో బతుకమ్మల కోసం ఏర్పాట్లు చేశారు.సిఐ తిరుమల్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు,నాయకులు, అధికారులు పాల్గొన్నారు.





