
–బేడ బుడగ జంగాల తరపున ప్రణవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వెనుకబడిన కులాలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని అందులో భాగంగా ఉప కులాలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమ సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేయాలని బేడ బుడగ జంగం, జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు అన్నారు. శనివారం హుజురాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 40 సంవత్సరాలుగా హుజురాబాద్ లోని బుడగ జంగం కాలనీలో నివసిస్తున్న ప్రజలంతా వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఏ నాయకుడు తమ సమస్య పరిష్కరించలేదన్నారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం తర్వాత తమ వైపు కన్నెత్తి కూడా చూసిన నాయకుడు లేరని అన్నారు. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ కు తమ సమస్యను విన్నవించిన వెంటనే కాలనీకి వచ్చి సమస్యలను దగ్గరుండి చూశారన్నారు. వెంటనే అధికారులను పిలిపించి బుడిగజంగాల కాలనీ సమస్యల పరిష్కారానికి ఎస్టిమేషన్ వేయాలని ఆదేశించారని తెలిపారు. అందులో భాగంగానే 25 ట్రిప్పుల మట్టిని, మొరాన్ని పోయించి తాత్కాలిక పరిష్కారం చూపారని, భవిష్యత్తులో శాశ్వత పరిష్కారం కూడా చేస్తానని చెప్పినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉపకులాలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే తాము కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతామని అన్నారు. ఈ సమావేశంలో బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తుర్పాటి లింగయ్య, రాష్ట్ర నాయకులు వాన రాశి జాన్, రాష్ట్ర నాయకులు చింతలంజి, మండల నాయకులు కడమంచి స్వామి, తూర్పాటి శంకర్, తూర్పాటి రామచంద్రం, గంధం మధు, భూతం అంజన్న తదితరులు పాల్గొన్నారు.







