
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, అక్టోబర్ 07: విధినిర్వహణలో ఆదివారం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన హుజూరాబాద్ ఆర్టీసీ డిపో డ్రైవర్ ఠాకూర్ రమేష్ సింగ్ నేత్రదానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపారు. రమేష్ సింగ్ భార్య మంజులభాయి, ముగ్గురు కుమార్తెలు పుట్టెడు దుఖంలో ఉండి కూడా చూపులేని వారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చనే మంచి ఉద్దేశంతో నేత్రదానానికి అంగీకరించారు. తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ జిల్లా ప్రతినిధి ఆధ్వర్యంలో వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సిబ్బంది, ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ నిపుణులు కార్నియా, నేత్రాలు మృతుని స్వస్థలం సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామానికి చేరుకుని కళ్ళను సేకరించారు. కాగా డ్రైవర్ రమేష్ సింగ్ కుటుంబానికి నేత్ర సేకరణ నిపుణులు సర్టిఫికెట్ అందించారు. అలాగే మరణానంతరం నేత్రదానం చేసి అంధులకు చూపునిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.






