
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, అక్టోబర్ 10: కరీంనగర్ బైపాస్ రోడ్డులో ఉన్న రేణుక ఎల్లమ్మ దేవాలయం ఆలయ ఆవరణలో గీత కార్మికులకు ఆధునిక టెక్నాలజీతో తయారుచేసిన కాటమయ్య సేఫ్టీ కిట్లు బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు. గీత కార్మికులు చెట్టుపై నుంచి పడకుండా ఈ సేఫ్టీ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. గురువారం వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదివేల కిట్లను గీత కార్మికులకు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. గీత కార్మికులందరూ కిట్లను సద్వినియోగం చేసుకునేలా సంఘం నాయకులు, అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో వెయ్యి మంది గీత కార్మికులకు పైగా సేఫ్టీ కిట్ల వినియోగంపై శిక్షణ ఇచ్చామన్నారు. ఐఐటీ హైదరాబాద్ వారు ఈ కిట్టు నాణ్యతను ధ్రువీకరించారని, రాష్ట్రంలోని 1,85,000 మంది గీత కార్మికులందరికీ అందిస్తామన్నారు.
ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని, శుక్రవారం హుస్నాబాద్, ధర్మపురి, మానకొండూర్, మంథనిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఒక్కో పాఠశాలకు రూ.180 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. వసతి గృహాలను, గురుకులాలను అధికారులు సందర్శించి విద్యార్థులకు సౌకర్యాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలన్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, ఆర్డీవో మహేశ్వర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కార్పొరేటర్ ఐలేందర్ , గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.
