Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ హుజురాబాద్ నగర శాఖ డిమాండ్ చేసింది. శుక్రవారం ఏబీవీపీ నగర హాస్టల్స్ కన్వీనర్ అభిలాష్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్స్ విడుదల చేయాలన్నారు. సంవత్సరాల తరబడి ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్స్ విడుదల చేయని కారణంగా దాదాపు రూ. 7,500 కోట్లకు పైగా పెండింగ్ లో ఉన్నాయని, నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావొస్తున్న పెండింగ్ బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తూ పేద విద్యార్థుల జీవితాల పట్ల శాపంగా మారారని మండిపడ్డారు. పేద విద్యార్థులకు సంజీవని వంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకానికి తూట్లు పొడుస్తూ విద్యార్థుల హక్కు అయినటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయకపోవడం అనేది పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే దిశగా ప్రభుత్వం కుట్ర చేస్తుంది అన్నారు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన వేలమంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రాని కారణంగా యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే కానీ సర్టిఫికెట్స్ ఇవ్వమంటూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్న ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఒకవైపు రియంబర్స్మెంటు బకాయిలు చెల్లిస్తే తప్ప మేము కళాశాలలో నడపలేని స్థితిలో ఉన్నామని ప్రైవేటు యాజమాన్యాలు మొర పెట్టుకుంటున్నారని తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ పైన ఆధారపడి నడిపిస్తున్న కళాశాలలు వందల సంఖ్యలో ఉన్నాయని, మధ్యలోనే కళాశాల యాజమాన్యాలు చేతులెత్తే పరిస్థితి కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు యాజమాన్యానికి అటు ప్రభుత్వానికి మధ్యలో బలవుతున్నది విద్యార్థులే నని, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సర్టిఫికెట్స్ రాక ఒకవైపు ఉన్నత విద్యకు మరొకవైపు ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా సర్టిఫికెట్స్ లేని కారణంగా విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి నెట్టి వేయబడుతున్నాయన్నారు. ప్రభుత్వాలు మారుతున్న విద్య వ్యవస్థ తీరు మారడం లేదు విద్యార్థుల జీవితాలు బాగుపడటం లేదన్నారు. ఉన్న విద్యాలయాలను విద్యావ్యవస్థను పటిష్ట పర్చాల్సిన ప్రభుత్వమే విద్యను అంధకారంలోకి నెట్టి వేస్తూ నూతనంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటూ యూనివర్సిటీలు అంటూ కొత్త హామీలతో చేతులు దులుపుకుంటుంది తప్ప ఇచ్చిన హామీలు మాత్రం అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వానికి విద్యారంగం పట్ల ఉన్న చిత్తశుద్ది ఏంటో విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ లోనే అవగతం అవుతుందని, సంవత్సరాల తరబడి అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్న, అనేక కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విద్యార్థుల యొక్క హక్కు అని జ్ఞప్తికి తెచ్చుకొని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందన్నారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని ఏబీవీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర హాస్టల్స్ కన్వీనర్ పెరుగు అభిలాష్, నగర సంయుక్త కార్యదర్శి బొంతల సిద్దు, పుట్టపాక అజయ్, మంతెన జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.






