
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని మారుతినగర్ కు చెందిన ఓ యువకుడిని గంజాయి కేసులో రాత్రి మహారాష్ట్ర నెంబర్ కలిగిన వాహనంలో కొందరు వ్యక్తులు పోలీసులమని చెప్పి ఇంటికి వచ్చి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ యువకుడి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తులు అరగంట గంట పాటు అతనికి, అతని కుటుంబ సభ్యులకు వివరాలు చెప్పి బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకొని తీసుకొని వెళ్లినట్లు తెలిసింది. అయితే సదరు యువకుడు గంజాయి విక్రయించే వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు తెలుసుకొని అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుండగా.. ఆ యువకుడు నిత్యం తమ కళ్ళ ముందే కనిపిస్తాడని, అతనికి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలతో సంబంధం లేదని వాడ ప్రజలు పేర్కొన్నారు. అలాంటప్పుడు మహారాష్ట్ర నంబర్ కలిగిన వాహనంలో కొందరు పోలీసులమని చెప్పి రాత్రి వచ్చి అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, హుజురాబాద్ పోలీసులను ఈ విషయమై ‘స్వర్ణోదయం’ వివరణ కోరగా తమకు మహారాష్ట్ర పోలీసుల నుండి ఎలాంటి ముందస్తు సమాచారం లేదని.. తాము అదుపులోకి తీసుకోలేదని హుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికి మారుతినగర్ కి చెందిన యువకుడిని రాత్రి వేళలో అదుపులోకి తీసుకున్న వ్యక్తులు ఎవరు !? ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు.. అనేది స్పష్టత లేకపోవడంతో స్థానికులు తీవ్ర భయంతో గురి చేయడంతో పాటు ఈ విషయం చర్చనీయాంశముగా మారింది.






