
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ మునిసిపల్ లో పనిచేసే ఉద్యోగులు ఎవరైనా తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని వారిని జిల్లా అధికారులకు సరెండర్ చేయడం జరుగుతుందని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం మున్సిపల్ సర్వసభ్య సమావేశం చైర్ పర్సన్ రాధిక అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా 14, 24వ వార్డులకు చెందిన ప్రజలు తమకు ప్రధాన రహదారి వెంట గుంతలు ఉండడం, అస్తవ్యస్తంగా పలు రోడ్లు ఉండడం వాహనదారులకు ఆసౌకర్యం కలుగుతుందని సభ జరుగుతుండగా ఆందోళన చేశారు. దీనికి స్పందించిన చైర్ పర్సన్ గందె రాధిక బోర్నపల్లికి వెళ్ళే కాకతీయ కెనాల్ నుండి బోర్నపల్లి శివారు వరకు R&B రోడ్డు వెంట ఉన్న విద్యుత్ పోల్స్, ఎయిర్ వాల్స్, గేటు వాల్స్ సెట్ బాక్ చేయిస్తూ, రోడ్డు వెంట ఉన్న చెట్ల పొదలను తొలగించి, బోర్నపల్లి నందు మౌలిక వసతులైన రోడ్లు, మురికి కాలువలు నిర్మాణము పారిశుద్ధ్య, మంచినీటి వసతులు కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు. దాంతో వారు ఆందోళన విరమించారు. పాలకవర్గము ఆమోదం తెలిపిన పనులను నిర్వర్తించే ఉద్యోగులు విధుల పట్ల నిర్లక్ష్యము వహిస్తూ భాద్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నందున, సంబందిత ఉద్యోగులను జిల్లా కలెక్టర్ కు, హైదరాబాదు మునిసిపల్ కమిషనర్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కు సరెండర్ చేయాలని కమిషనర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, కమిషనర్ సమ్మయ్య, మున్సిపల్ ఏఈ సాంబరాజు, పాలకవర్గ సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.






