
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,హుజురాబాద్: సమాజంలో జీవించే ప్రతి వ్యక్తికి చట్టాల పట్ల అవగాహన ఉండాలని, దానివల్ల జీవితానికి మేలు జరుగుతుందని హుజురాబాద్ సీనియర్ సివిల్ జడ్జ్, లోక్ ఆదాలత్ చైర్మన్ పి.బి. కిరణ్ కుమార్ అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని న్యూ శాతవాహన హైస్కూల్లో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కిరణ్ కుమార్ మాట్లాడుతూ…. రేపటి భావి భారత పౌరులైన విద్యార్థిని విద్యార్థులకు విద్యతో పాటు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. చట్టాలపై అవగాహన ఉన్నప్పుడు నేరాలు తగ్గుతాయని అన్నారు. ఒక పని చేస్తే అది తప్పు అని తెలిసినప్పుడు దాని ద్వారా మనకు శిక్ష పడుతుంది అనే అవగాహన ఉన్నప్పుడు ప్రతివాడు తప్పు చేయడానికి వెనుకాడుతాడని అన్నారు. దేశంలో ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా జీవిస్తున్నాడంటే ఎన్నో చట్టాలు వారికి అండగా ఉన్నాయని విషయం తెలుసుకోవాలని అన్నారు. బాల బాలికల రక్షణగా అనేక చట్టాలు ఉన్నాయని వాటికి తెలుసుకోవడం వల్ల పిల్లలు వివక్ష నుండి బయట పడతారని అన్నారు. బాలికలు మేజర్ కావాలంటే 18 సంవత్సరాలు నిండాలని, బాలురు మేజర్ కావాలంటే 21 సంవత్సరాలు ని ఒలనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని అన్నారు. అనంతరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పాలడుగు అలేఖ్య మాట్లాడుతూ…. విద్యనభ్యసించే సమయంలో ముఖ్యంగా బాలికలు తమ హక్కులను కాపాడుకోవాలని, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి తెలియాలని అన్నారు. బాలికల అభివృద్ధి కోసం అనేక చట్టాలు ఉన్నాయని, వాటి ద్వారా బాలికల అభివృద్ధికి అవి తోడ్పడుతాయని అన్నారు. మైనర్ బాలికలపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగిన ఫో క్సో చట్టం వారిని రక్షిస్తుందని అన్నారు.మహిళల అభివృద్ధి కోసం రక్షణ కోసం సైతం చట్టాలు ఉన్నాయని వాటిని గురించి తెలుసుకోవాలని అన్నారు. సమాజంలో జరిగే మంచి చెడులను తెలుసుకున్నప్పుడే భవిష్యత్తు బాగుంటుందని ఆమె అన్నారు. బాలికలు సైతం అవకాశాలను అందిపుచ్చుకొని గొప్పవారుగా తయారు కావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోస్కుల శ్రీనివాస్, కరస్పాండెంట్ వకుళాభరణం వెంకటేశ్వర్లు, పరాంకుశం కిరణ్ కుమార్, ఉపాధ్యాయులు సతీష్, శ్రీధర్, కుమారి, షాహిన్, సరిత, అరుణ, రామ, నాజియా, రిజ్వానా, లత, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.






