
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: కౌశిక్ రెడ్డి అంటే ఈ సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పడు నిలదీస్తున్న కౌశిక్ రెడ్డి పై రేవంత్ రెడ్డి కక్ష పెంచుకున్నాడని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం చేయాలని అడిగితే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణరహితంగా దాడి చేస్తారా?అని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు పోలీసులు ఓవరాక్షన్ చేస్తే.. మేము వచ్చాక తప్పకుండా మిత్తితో చెల్లిస్తాం అని హెచ్చరించారు. అయినా వెనక్కి తగ్గకుండా ప్రజల కోసం పోరాటం చేస్తున్న కౌశిక్ రెడ్డి పై ఈసారి పోలీసుల ద్వారానే రేవంత్ రెడ్డి దాడి చేయించాడన్నారు. ప్రశ్నిస్తే భయపడి దాడులకు పాల్పడే ఇంత పిరికి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు అన్నారు. కౌశిక్ రెడ్డి పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా.. కౌశిక్ రెడ్డి పై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. అదే విధంగా పోలీసులు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ వెంటనే విడుదల చేయాలి. – కేటీఆర్.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై జరిగిన పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా.. మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.
దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సహాయం చెల్లించాలని కోరడమే కౌశిక్ రెడ్డి చేసినా తప్పా? అని మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? అన్నారు. అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మా ఎమ్మెల్యే ఆరోగ్యం, భద్రత.. పట్ల పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని చెప్పారు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు.






